* కూటమి పాలనలో కుట్ర పన్ని ఓట్లు తీసేశారన్న మాజీ ఎమ్మెల్యే ...
* న్యాయ పోరాటం చేస్తానని స్పష్టీకరణ ...
* కడపలోను మాజీ డిప్యూటి సిఎం అంజాద్ భాష, కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు ..
* SIR ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలపై కలెక్టర్ కు వైసీపీ ఫిర్యాదు
కడప :
అంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సర్ అనుకున్నంత పని చేస్తుంది. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం కుట్రపన్ని ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తుందన్న వైసీపీ ఆరోపిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా కడప జిల్లాలో వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, అయన కుటుంబ సభ్యుల ఓట్లే గల్లంతవ్వడం చర్చనీయాంశంగా మారింది. కేవలం డిలీటెడ్ అని స్టాంవు వేసి ఓట్లు తొలగించెయ్యడం కలకలం రేపుతుంది.
కడప జిల్లాలోని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత రఘురామిరెడ్డి ఓటు చాపాడు మండలం నక్కలదిన్నెలో ఉండగా, అయన ప్రతి సారి ఎన్నికల్లో అక్కడే ఓటు వేస్తున్నారు. కానీ ఇప్పుడు సర్ సర్వేలో ఓటర్ల జాబితాలో అయన ఓట్ పై 'డిలీటెడ్' అని స్టాంప్ వేసి ఓటు తీసేశారు. అంతేకాదు చాపాడు మండలంలోని చిన్నగురువలూరులో ఉంటున్న తన చిన్నకుమారుడు దుష్యంత్ రెడ్డి, అతని భార్య లక్ష్మీ ప్రసన్నల ఓట్లు సైతం 'డిలీటెడ్' అని స్టాంప్ వేసి ఓట్లు తీసేశారు. ఈ ఇరువురు 2019, 2024 ఎన్నికల్లోను ఇక్కడే ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు అర్హులైన ఓట్లు తీసివేయడం చర్చనీయాంశంగా మారింది. వీరితో పాటు నియోజకవర్గంలోను, చివరకు తన సొంత గ్రామానికి చెందిన చాలా మంది పేర్లు తొలగించి, కొత్తవారి పేర్లు చేర్చారని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు.

ఇలా కూటమి ప్రభుత్వం కుట్రపన్ని అర్హులైన వారి ఓట్లు తీసివేసి తమకు అనుకూలమై వారి ఓట్లు చేర్చడంపై అయన మండిపడ్డారు. వైసీపీ సానుభూతిపరుల పేర్లు ఓటర్ లిస్టులో నుంచి తొలగిస్తున్నారని, 2002 ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమని అడిగితే అధికారులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అయన వాపోయారు. SIRపై వైసీపీ న్యాయపర పోరాటం తప్పక చేస్తుందని, అర్హులైన వారందరికి ఓటు హక్కు వచ్చేలా చేస్తామని రఘురామిరెడ్డి చెప్పారు.
కడపలోను మాజీ డిప్యూటి సిఎం అంజాద్ భాష ఓట్ గల్లంతు ... :
కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటు 2002 జాబితాలో మిస్సింగ్ అయ్యింది. తన కుటుంబ సభ్యుల ఓట్లతో సహా అందరి ఓట్లు గల్లంతయ్యాయని అయన తెలిపారు. అంజాద్ బాషా డోర్ నెంబర్ 9-420 నుంచి వరుసగా నాలుగు ఇళ్ల ఓట్లు గల్లంతు కావడంతో అయన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాను పుట్టినప్పటి నుంచీ అదే ఇంట్లో ఉంటున్నా.. లిస్టులో ఓట్లు ఎలా మాయమవుతాయని ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం కల్పించుకుని తమ ఓట్ల జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.
SIR ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలపై కలెక్టర్ కు వైసీపీ ఫిర్యాదు :
మరోవైపు కడప జిల్లాలో SIR ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలపై కలెక్టర్ శ్రీథర్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ లు జిల్లా కలెక్టర్ గారిని కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. SIR ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన వీరు, టీడీపీ BLAలకు ఎన్నికల కమిషన్ అధికారిక డేటా ఎలా చేరుతుందనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అలాగే ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, దీనిపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
