బొలిశెట్టితో పార్టీకి ఎలాంటి అనుబంధం లేదు : జనసేన
*ఇటీవలే జనసేనలో ఉన్నానని ప్రకటించిన బొలిశెట్టి ..
*అంతలోనే పార్టీకి సంబంధం లేదంటూ ప్రకటన ...
Bolisetty Satyanarayana issue :

జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana)కు పార్టీతో ఎలాంటి అనుబంధం లేదని జనసేన (Janasena) ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి సత్యనారాయణ తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించే నిమిత్తం పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంగీకరించారు. బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలతో పార్టీ (Party)కి సంబంధం లేదు అని జనసేన పేర్కొంది.
బొలిశెట్టి సత్యనారాయణ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో పెరిగి పోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా 2020లో నాటి ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జనసేన తరఫున ఆయన చేసిన ఈ పోరాటాన్ని నాడు పార్టీ కూడా ప్రోత్సహించింది. అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇందులో జనసేన పార్టీ అత్యంత కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. తాను గతంలో వేసిన కాలుష్యం వ్యతిరేక కేసు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన గుర్తించారు. ఈ క్రమంలో బొలిశెట్టి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండటం సరికాదని ఆ పదవికి మాత్రమే రాజీనామా చేశారు.
కానీ ఇటీవల రాజమహేంద్రవరంలో పాల కల్తీపై కూడా స్పందించిన సందర్బంలో ఓ అసక్తి కర సంఘటన చోటుచేసుకుంది. కల్తీ పాల ఘటనపై బొలిశెట్టి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మరణాలకు అసలు కారణం పాలా లేక నీళ్లా అంటూ ప్రశ్నించారు. నిజానిజాలు నిష్పక్షపాతంగా తేలాలి అన్నారు. కాలుష్యం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠినంగా వ్యవహరించాలన్నారు. దీంతో ఎక్స్ లో ఓ వ్యక్తి జనసేనకు రాజీనామా చేసినా బాగా స్పందించారని చెప్పుకొచ్చారు. కానీ బొలిశెట్టి మాత్రం తాను జనసేనలోనే ఉన్నాను... ఉంటాను అంటూ స్పందించి సమాధానమిచ్చారు.
ఇప్పుడు ఉన్నఫలంగా జనసేన మాత్రం అయనకు జనసేనతో సంబంధం లేదంటూ ప్రకటించడం అసక్తికరంగా మారింది. బొల్లినేని ఇక పార్టీతో సంబంధం లేదన్నట్లు ప్రకటించడమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ ప్రకటనపై బొలిశెట్టి ఎలా స్పందిస్తారన్నది అసక్తికరంగా మారింది.