ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ...
భారీగా చేరుకున్న తెలంగాణ పోలీసులు
ఒకవేళ అరెస్ట్ చేసేందుకు వస్తే...
హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ...
హైదరాబాద్ :
జనసేన, పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఓ టీవి డిబెట్ లో చేసిన వ్యాఖ్యలపై ఎపి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో నాగేశ్వర్ రావు ఇంటి వద్ద తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఇక్కడి పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించాల్సి వస్తుందని చెప్తున్న విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అరెస్టుకు అనుమతి ఇస్తారా లేక అరెస్టును అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అరెస్ట్ చేసేందుకు వస్తే హైకోర్టులో అరెస్ట్ కాన్సిల్ చేసేందుకు రిట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఉన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. ఆయనపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని, అది తెలంగాణ మేధావులపై దాడిగా భావిస్తామని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నాయకురాలు కవిత హెచ్చరించారు. అవసరమైతే హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని కూడా ఆమె పేర్కొన్నారు. అనేక మంది జర్నలిస్టులు కూడా కేసుల నమోదుపై తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తనపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు సైతం .. తాను అరెస్టుకైనా సిద్ధమని, అయితే బెయిల్ కోసం మాత్రం దరఖాస్తు చేసుకోబోనని స్పష్టం చేశారు. అరెస్టు జరిగే పక్షంలో హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో కూడా ఆయన ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.