* దళితుడు ఏ మతంలో ఉన్నా దళితుడే ...
* మతం మారినా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం పోదు ...
* కేంద్రంలో మీరు పోరాడండి .. కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని కోరిన రోమన్ కాథలిక్ డియోసెస్ బిషప్, ఫాదర్లు...
* దళిత క్రైస్తవులకు వైసీపీ ఎప్పటికి అండగా ఉంటుంది...
* 2023లో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు అసెంబ్లీలో తీర్మానం చేశాం...
* సుప్రీం తీర్పు చాలా దారుణం ... కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి....
కడప :
దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కడప రోమన్ కాథలిక్ డియోసెస్ బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాష్ సగినాలా కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కడప రోమన్ కాథలిక్ డియోసెస్ బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాష్, పలువురు గురువులు కడప ఎంపిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా కడప రోమన్ కాథలిక్ డియోసెస్ బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో క్రైస్తవుల్లో దళితులే కాదని, అనేక మంది వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారని, కానీ మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం దళితుల పట్ల తొలగిపోదని వివరించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందని, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు మాత్రమే ఎస్సీ హోదా నిరాకరించడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. కానీ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు దళితులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, తప్పక దళిత క్రైస్తవుల పట్ల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ హోదా వర్తించేలా చూడాలని కోరారు.
ఈ విషయమై కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి స్పందిస్తూ ...దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. అదే వైఖరికి వైయస్ఆర్సీపీ ఇప్పటికీ కట్టుబడి ఉందని, దళిత క్రైస్తవుల హక్కుల కోసం వైయస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. అంతేకాకుండా బాలకృష్ణన్ కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా సానుకూల సిఫార్సులు చేస్తున్నామని, ఇప్పటికే వైసీపీ ఎంపీలు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు వినతిపత్రం సమర్పించడం జరిగిందని, దళితుల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా తప్పక అడ్డుకుంటామని, అవసరమైతే పార్లమెంట్ వేదికగా కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.