* ఎపి క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు క్లాస్ ..!
* ఇక నుంచైనా మాట్లాడండి... తేల్చిచెప్పిన బాబు ....
Astra news desk :
ప్రస్తుతం ఎపీలో తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు, మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ విమర్శలకు అధికార కూటమి నుంచి తగిన స్పందన రాలేదన్న వాస్తవం అందరికి తెలిసిందే. ఈ మూడు ఘటనల నేపథ్యంలో ఎపీ ప్రభుత్వం, కూటమి పార్టీలు ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయినా ఇంత వరకు డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ మినహా మరెవ్వరు నోరుమెదపలేదు. దీంతో నానాటికి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండటంతో ఇప్పుడు ప్రభుత్వం మేల్కొన్నట్లు కనిపిస్తొంది. ఈ నేపధ్యంలోనే నేడు జరిగిన ఎపీ క్యాబినెట్ మీటింగ్ లో అజెండా అంశాలతో పాటు సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాల వివాదంపై ఇక నుంచి మౌనంగా ఉండటం కుదరదని సిఎం చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
రాష్ట్ర కేబినెట్లో (AP Cabinet) ఇవాళ అజెండా అంశాలపై చర్చ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు (Chandrababu) సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాల అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఇందులో ఆయన ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను టార్గెట్ చేస్తూ విపక్ష పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు చర్చించినట్లు వినికిడి. ఈ విషయంలో మంత్రులు ఎలా వ్యవహరించాలో చంద్రబాబు వారికి మార్గదర్శనం చేశారని సమాచారం.
ఈ మధ్య రాష్టంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చురుగ్గానే స్పందిస్తున్నారు. దీంతో విపక్ష వైసీపీ నేతలు పవన్ లక్ష్యంగా విమర్శలకు దిగుతున్నారు. ఈ విషయంలో పవన్ కు తన సొంత పార్టీ జనసేన నేతలతో పాటు మంత్రులు, టీడీపీ నాయకుల నుంచి మాత్రం తగిన మద్దతు లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయనే స్వయంగా వైసీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ వ్యవహారాన్ని పవన్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీలో చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై వచ్చే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని వారికి సీఎం సూచించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను వివాదాల్లోకి లాగితే మంత్రులు గట్టిగా స్పందించాలని ఆదేశించారు. దీంతో పాటు వివిధ అంశాలపై వైసీపీ చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమాధానం ఇవ్వాలని మంత్రుల్ని చంద్రబాబు కోరారు. తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలతో పాటు డీఎస్సీ విషయంలో విమర్శలకు అధికార కూటమి నుంచి తగిన స్పందన రాలేదన్న విమర్శల నేపథ్యంలో చంద్రబాబు మంత్రులకు దిశానిర్ధేశనం చెయ్యడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇక కూటమికి వ్యతిరేకంగా కథనాలు వచ్చినా... విపక్షాలు విమర్శించినా అధికార పక్షం కూడా ఇక పోటాపోటీ విమర్శలకు దిగడం ఖాయంగా కనిపిస్తొంది.