KADAPA :
కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు వైఎస్సార్సీపీ నేతలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వాగ్వాదం జరిగింది. పార్టీ నేతలను పోలీసులు ముందుకు కదలనివ్వకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
ఈ క్రమంలో పోలీసులు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇక, స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వారిలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, రాచమల్లు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డిలు ఉన్నారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలు మాత్రం కచ్చితంగా జిందాల్ స్టీల్స్ పరిశీలించి చెబుతున్నారు. 
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ ను మళ్లీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ క్రెడిట్ను దక్కించుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు పర్యటించే హక్కు ఉందని, పోలీసుల చర్యలను ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు.