Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

అమరావతి రైతులకు వైసీపీ అండ... !

12 Jul 2026
01:28 PM
306

* బలవంతపు భూసేకరణ...బుల్డోజర్లతో  పంటలను ధ్వంసం దారుణం...
* ఎక్స్ వేదికగా ఖండించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ 

Article Image

అమరావతి  : 

అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను  ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ 
తీవ్రంగా ఖండించారు. రైతుల కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. 

Article Image

బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?

రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా? 

ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?

రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. 

ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం.  @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!