* అధికార మదంతో బరితెగించిన టిడిపి నాయకుడి కుటుంబం...
* బోరు విషయంలో వివాదం ...
* అనంతరం ఓ మహిళ ఇంటిపైకి వెళ్లి రోడ్డుపై వివస్త్రను చేసి చావబాదిన టిడిపి నాయకుడి కుటుంబ సభ్యులు...
* వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన టిడిపి పెద్దలు..
* వ్యవహారం కలకలం రేపడంతో ....
* సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆగ్రహం ...పార్టీ నుంచి సస్పెండ్ ...
* కటకటాల్లోకి టిడిపి నాయకుడి కుటుంబ సభ్యులు ....
Shocking incident in Guntur :
అధికార బరితెగింపుతో.. గుంటూరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి స్థానిక తెలుగుదేశం నాయకుడు మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు చావు బాదారు. అందులో మగవారు పక్కనుండి ఉపిగొల్పితే.... ఆ మహిళను వివస్త్రను చేసింది మాత్రం సాటి మహిళలు, ఓ హిజ్రా. ఒక మహిళను వివస్త్రను చేస్తే ఎంతటి అవమానకరంగా ఉంటుందు తెలిసిన మహిళలు కూడా అధికార మదంతో రెచ్చిపోవడం....మహిళను వివస్త్రను చేసి పది నిమిషాల పాటు రోడ్డుపైనే ఉంచడాన్ని చూస్తే ... సభ్య సమాజం తలదించుకోవలసిన పరిస్ధితి. ఈ ఘటన చూస్తే....సమాజం ఎక్కడికెళ్తుందొనన్న అనుమానం కలగకమానదు.
ఓ వైపు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తామని, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని...మహిళల జోలికి వస్తే అది వారికి చివరి రోజు అవుతుందని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత సైతం నిత్యం హెచ్చరికలు చేస్తున్నప్పటికి... కొందరు అధికార పార్టీ నేతలు మాత్రం అధికార మథంతో ఉగిపోతూ...ఆ మాటలకు నిలువునా పాతరేస్తున్నారు. గుంటూరు నగరంలో ఈ నెల 13న ఘటన చోటుచేసుకున్న ఈ అత్యంత అమానవీయ ఘటన.. పాలకుల ఉద్దేశాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన తెలుగుదేశం పెద్దలు ... చివరకు వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా కలకలం రేపడంతో పోలీసులు...అధికారులు చర్యలకు రంగంలోకి దిగారు.
అధికార పార్టీలో ఉంటే మాత్రం ..అంత అహంకారమా... ?
గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో ఈ భయానక ఘటన వెలుగుచూసింది. నీటి మోటార్ వేసే విషయంలో 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులకు, స్థానిక మహిళకు మధ్య ఈ నెల 13న చిన్నపాటి వివాదం మొదలైంది. గొడవ సద్దుమణిగిన అనంతరం ఆ మహిళ ఇంటిపైకి స్థానిక టిడిపి నాయకుడి కుటుంబ సభ్యులు వెళ్లడంతో ఈ గొడవ కాస్తా ముదరడంతో, మల్లెల మూర్తి కుటుంబం అమానవీయంగా ప్రవర్తించింది. కొందరు హిజ్రాలతో కలిసి మహిళను కాళ్లతో తన్నుతూ దాడికి దిగారు. అంతటితో ఆగక నడిరోడ్డుపైనే ఆమెను వివస్త్రను చేసి చావబాదారు. ఈ దాడికి సంబంధించిన భయానక సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. నీటి మోటర్ వద్ద రగలుకున్న ఒక సాధారణ వివాదం అధికార పార్టీ నేత కుటుంబం బరితెగించి, ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి కాళ్లతో తన్నిన వైనం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎంత అధికార పార్టీలో ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబానికి అంతటి అహకారం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏ మాత్రం అమోద్యయోగ్యం కాదు ..సీఎం చంద్రబాబు, లోకేష్ ఆవేదన... :
గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇలా మహిళలకు అవమానం జరిగినా అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సిఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారని, ఈ దారుణంలో ప్రమేయం ఉన్న సదరు పార్టీ నాయకుడిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వ నినాదం ఒక్కటేనని ... పక్షపాతం, భయం లేకుండా చట్టం తన పని తాను కఠినంగా చేసుకుపోతుందన్నారు. రాజకీయ అండదండలు ఉన్నాయనే నెపంతో తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తికీ రక్షణ కల్పించే ప్రసక్తే లేదని...రాష్ర్టంలో ప్రతి మహిళకూ తన గౌరవానికి, రక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పిస్తామని హెచ్చరించారు. మరో వైపు గుంటూరు ఘటనపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అండ లేదా పార్టీ అనుబంధం చట్టం నుంచి ఎవరినీ కాపాడదని స్పష్టం చేశారు. మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిందితులెవరైనా చట్టం ముందు సమానమేనని హెచ్చరించారు. తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే గల్లా మాధవీ కూడా స్పందిస్తూ....బాధిత మహిళ తనను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన వెంటనే పోలీసులతో మాట్లాడి కఠిన చర్యలకు ఆదేశించారు. "మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే మాధవి.. నిందితుడు మల్లెల మూర్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, బాధిత కుటుంబానికి తాము పూర్తి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.
కటకటాల్లోకి నిందితులు.. :
గుంటూరులో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన... సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో... దాని ఆధారంగా నగరంపాలెం పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘటనపై పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై ఇలాంటి అనాగరిక దాడులకు పాల్పడే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఎంతైనా ఉందని, అధికార పార్టీ అని చూడకుండా కఠిన శిక్ష పడేలా చేస్తేనే ఇలాంటివి చోటుచేసుకోకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.