* సమావేశాన్ని బహిష్కరించిన విపక్షాలు..
* ఎన్సీపీఐకి ఆహ్వానంపై అభ్యంతరం...
* ఆహ్వానానికి కృతజ్ఞత తెలిపిన ఎన్సీపీఐ
Dealhi :
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించే అఖిలపక్ష సమావేశంలోనే విపక్షాలు నిరసన తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన రెబల్ ఎంపీలు ఏర్పాటు చేసిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)కి ఆహ్వానం పంపడం వివాదాస్పదమైంది. ఈ ఆహ్వానాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు సమావేశాన్ని బహిష్కరించాయి. గుర్తింపులేని పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఎలా పిలిచారని ప్రశ్నించాయి.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అధికారిక గుర్తింపు లేని పార్టీకి సమావేశంలో చోటు కల్పించడం సరికాదన్నారు. పార్లమెంట్ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ ఆ పార్టీ ఎంపీలు తృణమూల్ సభ్యులుగానే నమోదై ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యేక పార్టీ హోదాతో ఆహ్వానం పంపడం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
తృణమూల్కు చెందిన సుమారు 20 మంది రెబల్ ఎంపీలు ఇటీవల నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. అయితే ఆ పార్టీకి ఇంకా అధికారిక గుర్తింపు లభించలేదు. ఈ అంశమే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం చుట్టూ రాజకీయ చర్చకు దారి తీసింది.
మరోవైపు ఎన్సీపీఐ పార్లమెంటరీ పక్ష నేత కాకోలి ఘోష్ దస్తిదార్ స్పందించారు. తమ పార్టీకి అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్లో తమ అభిప్రాయాలు వినిపించే అవకాశంగా దీన్ని భావిస్తున్నట్లు చెప్పారు.
వాకౌట్ అనంతరం కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా వాకౌట్ చేశాయని, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అన్యాయంగా అభివర్ణించారు.
అయితే నిరసన అనంతరం విపక్ష పార్టీలు తిరిగి సమావేశ మందిరానికి చేరుకుని చర్చల్లో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, వి. మురళీధరన్, అను ప్రియా పటేల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరి, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.