* కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ ఆందోళన ...
* పార్లమెంట్ ప్రధాన గేటు వద్దకు భారీగా చేరుకున్న మద్దతుదారులు...
* బారికేడ్లు దాటేందుకు యత్నం...
* పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం ...
* అడ్డుకోవడంతో పోలీసులపై చెప్పులు విసిరిన సీజేపీ కార్యకర్తలు ...
* సీజేపీ అధ్యక్షుడు అరెస్ట్.. ఆందోళనల్లో పలువురు పోలీసులకు గాయాలు
* చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా దళాలు
DELHI :
పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తోంది. అంతకుముందు నుంచే ప్రముఖ సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ సైతం ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం తొలిరోజున పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపునిచ్చింది.

ప్రస్తుత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, నీట్ ప్రశ్నాపత్రం లీక్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించినా..పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. దీంతో మద్దతుదారులు, ఆందోళనకారులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపుగా దూసుకెళ్లడంతో పాలు గేట్లు దాటుకుని పార్లమెంట్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించి, చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకోవడంతో పోలీసు సిబ్బంది కొందరికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన సీజేపీ మద్దతుదారులు భద్రతా దళాలపై చెప్పులు, వాటర్ బాటిళ్లను విసిరారు.
ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేతో పలువురు నిరసనకారులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ను కూడా నిలిపివేశారు. మరో వైపు కార్యకర్తలను ‘శాంతంగా ఉండాలని’ సీజేపీ పలుమార్లు కోరుతూ వచ్చింది. కోరింది. ‘‘మనల్ని అడ్డుకుంటున్నప్పటికి సంయమనం పాటించి.. శాంతిని కాపాడండి. మనం శాంతి, ప్రేమతో మాత్రమే దీనిని గెలుస్తాం’’ అని ఆ పార్టీ పేర్కొంది. ఇప్పటికే నిరాహార దీక్ష చేస్తోన్న ప్రముఖ సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందజేస్తోన్న విషయం తెలిసిందే.

కాక్రోచ్ పార్టీ మద్దతుదారుల ఆందోళనల నేపధ్యంలో పోలీసులు అంక్షలు విధించారు. ముందస్తు అనుమతితో జంతర్ మంతర్ వద్ద నిర్దేశించిన ప్రదేశంలో తప్ప, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మందితో నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, ఆందోళనలు, సమావేశాలు నిషేధం అంటూ ఎక్స్ లో ఢిల్లీ పోలీసులు ఒక పోస్ట్ పెట్టారు. ప్రతి ఒక్కు చట్టాన్ని గౌరవించాలి.. ఎలాంటి అనధికారిక సమావేశాలు లేదా ప్రదర్శనలలో పాల్గొనవద్దని, శాంతిభద్రతల పరిరక్షణను కాపాడటంలో సహకరించాలి అంటూ ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజీవ్ చౌక్, జన్పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూసివేయడంతో ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలో కూడా గందరగోళం నెలకొంది. వందలాది మంది ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో చిక్కుకుపోయారు.

ఇదిలా ఉండగా, రాజీనామా డిమాండ్ వేళ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో సీజేపీతో చర్చలకు కేంద్రం ముందుకొచ్చినట్టు ఆ పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. కేంద్ర మంత్రి జేడీ నడ్డాతో తమ తరఫున ఇద్దరు సమావేశమవుతారని తెలిపారు. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భారీగా పారామిలటరీ బలగాలు, పోలీసులను మోహరించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు